తే.గి.!
గరెటె త్రిప్పెను కాలము కలిసి రాక
భీముడే, యోధుడు కిరీటి పేడియాయె
ధర్మరాజు విరటునికి దాసుడాయె
విధి వశంబున జరుగును వింతలెన్నొ
విధి చేయు వింత
February 8, 2023కర్మ శేషము
November 8, 2022ఉ.!
వెంటన రావు సంపదలు స్వేదమునోడ్చుచు గూడబెట్టినన్
జంటగనుండునట్టి సతి చావున తోడుగ రాదురా కడన్
ఇంటికి వారసుల్ చివరనేడ్చుచు విడ్తురు వల్లకాటిలో
మంటల లోన కాలినను మారక వచ్చును కర్మ శేషమే
శ్రీకైవల్యము
September 18, 2022పోతన భాగవతాన్ని “శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతిచెదన్” అని ప్రారంభించేడు. ప్రారంభిస్తూనే భాగవతం వ్రాయటంలొ తన అభీష్టాన్ని ఉద్ఘాటించేడు పోతన, కైవల్యాన్ని చేరు కోవటమే తన ఉద్దేశ్యము. ఎన్నెన్నో జన్మల సత్కర్మ ఫలమే మానవజన్మ. మానవజన్మ తోనే ఎవరైనా జన్మ రాహిత్యం పొంది పరమ్మత్మ లో ఐక్యమయే అవకాశం ఉంది, ఇదే కైవల్యాన్ని చేరుకోవటం. ఆటువంటి ఉత్కృష్టమైన మానవజన్మ కర్మ రాహిత్యం చేసుకుందుకి ఉపయోగించాలి. అయితే ఈ శ్రీకైవల్యం అంటే ఏమిటి. కైవల్యం అంటే నే గొప్పది పరమోత్కృష్టమైనది. దానికి శ్రీ అని పూర్వపద విశేషణం అవసరంలేదు. మరి ఈ శ్రీ అనే అక్షరం ఎందుకు.
సాధారణంగా, ఏదైన పద్యకావ్యం ప్రారంభం శ్రీకారంతో మొదలవుతుంది ఎందుకంటే చందస్సు శ్రీచక్ర సౌస్ఠవగుణం నుంచి పుట్టింది కాబట్టి, కవులందరు చందోబధ్ధకావ్యాలని వ్రాసినప్పుడు శ్రీకారం తొ మొదలెడతారు. కేవలం అంత చిన్న కారణం కోసం శ్రీకైవల్యం అని వ్రాసి కైవల్యాన్ని మరింత గొప్ప కైవల్యం అని వ్రాయనవసరం లేదు.
ఇక్కడ మనం మరింత గా పోతన స్థాయి లొ ఆలోచించాలి. ఎవరనా అడవులలోనికి వెళ్ళి తపస్సు చేస్తే, కుండలిని యోగం వలన కర్మ హరణమై కైవల్య ప్రాప్తికి అవకాశం ఉంది. కాని మానవజన్మ ఎత్తిన అందరూ తపస్సులో ములిగి పోతే కొంత కాలనికి మానవులందరూ అంతరించిపోతారు. ఇది అందరికి అనుసరణీయం కాదు. కాని పరమోత్కృష్టమై మానవ జన్మ ఎత్తి తిరిగి సంసారబంధంలో ములిగి కర్మ చక్రంలొ నలిగిపోవలిసిందేనా, దీనికి సమాధానమే ఈ శ్రీకైవల్యం, ఇక్కడ శ్రీ కైవల్యానికి విశేషణం కాదు, అసలు శ్రీ కైవల్యము అనే వి రెండు వేరు వేరు పదాలు. ఇక్కడ శ్రీ అనే అక్షరం ఇహాన్ని సూచిస్తుంది. ఇహ లోకం లో వైభవంగా బతికి ధర్మ కార్యాలు చేస్తూ ధర్మ బద్ధం గా బ్రతుకుతూ కైవల్యాన్ని చేరుకొనే మార్గమే భాగవతం. తనే కాదు భాగవతం చదివిన ప్రతీ వారికి జన్మ జన్మ ల కర్మ బంధం నుంచి విముక్తి కలిగి పరమాత్మ లో లీనమవుతారు. అందుకే పలికిన భవహరమగునట అని చెప్పేడు.
ఇక్కడ శ్రీ అనే అక్షరం ఒక అక్షర మే కాదు, ఒక పదం. ఒక పదమే కాదు, పరిపూర్ణ వాక్యం, పరిపూర్ణ వాక్యమే కాదు మానవజీవితానికి పరమార్ధాన్ని బోధించే సంపూర్ణ కావ్యం.
పోతన తెలుగు వాడిగా జన్మించడం తెలుగు వారు చేసుకున్న అదృష్ఠం. భాగవతాన్ని చదువుదాం. జన్మ రాహిత్యాన్ని పొందుదాం.
కాకరమురళీధర్. – కాముధ
మా తాతగారు
May 26, 2021తే.గీ.!
జగమెరిగిన బాపడు నిత్య సత్య శీలి
భుజ బలంబును, సారము, పొందికన్ గ
లిగియు గర్వము నెరు గరు, లేదనెడి ప
దమును మరచిన మనిషి మా తాత గారు.
– కాకర మురళీధర్
వివరణ:- *జగమెరిగిన బాపడు*.. చుట్టు పక్క అన్ని ఊళ్ళలొను సత్తి బాబు గారంటే బాగా తెలుసు, అతను ఒక బ్రాహ్మడిగా చేయ దగిన పనులన్నీ పురోహితం, జోతిష్యం ఇంకా చాల చేసేవారు. ఈ పదానికే ఇంకో అర్ధం, ఆయనే జగాన్ని పూర్తిగా ఎరిగినవారు అంటే చాలా పుణ్య తీర్ధాలు, పవిత్ర స్తలాలు పలు మార్లు దర్శనం చేయడం కోసం దేశమంతా చాలా తిరిగారు.
సత్యాన్నే నమ్ముకొని జీవించారు. ధర్మానికి నాలుగు పాదాలైన సత్యం, దయ, శీలము, న్యాయము జీవితార్ధాలుగా జీవించేరు.
ఆయన బలవంతుడు, బాగా సత్తువ గలవారు దొంగలని కూడా ఎదిరించేరు, ధైర్యవంతులు. అన్ని పనులు ఒక పద్దతిలొ చేస్తారు అయితే అతనికి ఎక్కడా గర్వం లేదు.
ఎవరైనా సహాయం అడిగితే ఎప్పుడు లేదు కాదు అని చెప్పరు వీలైనంత వరకు సహాయం చేసారు, దాని వలన కొన్ని సార్లు చిక్కుల్లొ పడ్డా సహాయం చేసే గుణాన్ని మాత్రం విడువలేదు. ఆయనే మా తాతగారు… కాకర సత్యనారాయణ — సత్తి బాబు గారు.
ఉప్మా
May 10, 2021ఉప్మా విశ్వరూపం
నైమి శారణ్యంలొ సనకాది మహా మునులు తపస్సు చేసుకొంటూ ఉండగా నారద మహర్షి విచ్చేసారు. అర్ఘ్య పాద్యాదుల అనంతరం సావకాసంగా కూర్చొని అక్కడ ఉన్న మహర్షులు వారి కుటుంబాలతొ ముచ్చటించారు. ముని పత్నులు వారి కష్టసుఖాలు వెళ్ల బొసుకుంటూ, భొజన సమయం లొ అప్పటికప్పుడు వచ్చే అతిథులకు షడ్ర షొపతమైన భొజనం సమకూర్చడం కష్టం అవుతొంది అని చెప్పారు.
అప్పుడు నారద మహాముని వారు నేను ఈవిషయమై ఇదివరకు విష్ణుమూర్తి వారితొ ముచ్చటించాను. ఆయన దానికి ఒక బ్రహ్మండమైన ఒక ఉపాయం చెప్పారు. వరినూక లేక గోధుమనూకైనా సరే ఉప్పు తొ కలిపి నేయితొ వండి వడ్డిస్తే షడ్రసొపైతమైన భొజనముతొ సమానం అవుతుందని. నెయ్యతొ కలిపి చెయడవలన దీనితొ మహానైవేద్యం కుూడా చెయవచ్చని తెలిపారు. దానికి ఆవాలు, జీల కర్ర మొదలగు సుగంధ ద్రవ్యాలతొ రంగరిస్తే అమృతతుల్యమవుతుందిని, అందువలన దీనికి ఉపమామృతము ( అమృతముతొ పోలిక గలిగినది) అనే పేరు వచ్చిందని తెలిపారు.
త్రేతాయుగం లొ అరణ్యవాసం లొ సీతాదేవి తరుచు దీనిని వండేవారని, ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసంలొ ఉన్నప్పుడు అక్షయపాత్ర కడిగేసిన తరువాత వచ్చిన దూర్వసమహామునికి వారి శిష్య గణానికి ద్రౌపది ఈ వంటకాన్నే చేసి మహర్షి అభిమానాన్ని పొందారని చెప్పారు. ప్రస్తుత కలియుగం లొ రుూపాంతరం చెంది దీనికి ఉప్మా అనే పేరుతొ సర్వ జనమోదం పొందిందని సెలవిచ్చారు.
ఉప్మా తత్వాలు
కొంతమందికి ఉప్మా ఇష్టం ఉండదు దానికి కారణం వారి ప్రారబ్ధ కర్మే, భూలొకం లొ స్వర్గం చూసే రాత వారికి లేదు అంతే, దీంట్లో ఉప్మా తప్పేం లేదు. బుద్దిః కర్మాను సారిణి అని కదా అర్యోక్తి. మన కర్మ ఫలానుసారం మనకి ఉప్మా ప్రాప్తిస్తుంది. ఉపకారం అంటే ఆమడదూరం ఉండేవాళ్ళకి ఉప్పులేని ఉప్మా తినాల్సి వస్తుంది. ఇతరలుని వెక్కిరించే వేళాకొళం వెసేవారికి ఉడికీ ఉడకని ఉప్మా తినాల్సి వస్తుంది. అందరిపై అకారణంగా అరుస్తూ చిర్రుబుర్రులాడుతూ ఉండేవారికి కారం ఎక్కువైన ఉప్మా తినాల్సి వస్తుంది. అందరితొ మంచిగా ఉండేవారికి జీడిపప్పు ఎక్కువగా ఉన్న రుచి కరమైన ఉప్మా దొరుకుతుంది. ఎంత చేసుకున్న వారికి అంత మంచి ఉప్మా….
ఉప్మా లొ పలు రకాలు..
మాములుగా చేసే గొధుమ నూక ఉప్మా యేకాకుండా, పెసరప్పు జీలకర్ర ఇంగువ వేసి చేసే వరినూక ఉప్మా, జీలకర్ర ఆవాలుపోపు పెట్టి చేసే బ్రెడ్ ఉప్మా, సేమ్యా ఉప్మా, రకరకాలు కురలు వెసి చెసే వెజటబుల్ ఉప్మా, అటుకుల ఉప్మా, ఇంకా పలు రకాలు. తినేవారికి జిహ్వచాపల్యం తీరేలా బొలెడు రకాలు.
ఊప్మా రూపాంతరాలు
పూర్వం గోలుకొండ ఇంకా కడుతూ ఉన్న రొజుల్లొ ఒకసారి అక్కడ కూలిపని చేస్తున్నవారిలొ ఒకావిడ వరినూకలేక బియ్యం తొ కూరగాయలు కలిపి ఉప్మా వండుతున్నాది. ఆ సువాసన అటుగా వెళుతూన్న నిజాంని ఆకర్షించింది. ఆయన వెంటనే తన వంట వాళ్లని ఆక్కడికి పంపించి ఏవండుతున్నారో కనుక్కురమ్మని చెప్పారు. వారు కనుక్కొని దానికి మరికొంచం మసాలాలు కలిపి వండి బిర్యాని ( బిర్ యాని – వేగంగా వండే అన్నం) అనిపేరు పెట్టారు. తరువాత కాలంలొ అని పులావు, ఫ్రైడ్రైస్ అంటు పలు విధాలుగా మారి మాంసంతొ కలిసి వేల వేల రూపాలు సంతరించుకుంది. ఈవిషయం మనకితెలిసిందే. దీని మూలాధారం ఉప్మాయే అని విన్నవించుకుంటున్నాను.
ఉపసంహారం
పోపులో జీడిపప్పు, మినపప్పు, శనగపప్పు ఒకే రంగులోకి (రాగి రంగు) మారగానే స్టౌ కట్టేసి, తరిగుంచుకున్న పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేయాలి. ఇవి వేగడానికి పొపులో ఉన్న వేడి చాలు. తరువాత సిధ్ధంగా ఉంచుకున్న టమాటా ముక్కలు, ఉల్లిచెక్కు, వీలుంటే పచ్చి శనగలు (మట్టర్), కొన్ని చిన్నతరిగిన కేరేట్ ముక్కలు వేసుకొని తగినంత నీరు ఉప్పు వేయాలి. నీరు తెర్లుతున్నప్పుడు గొధుమనూక వేసి ఉడకగానె వెడిగా తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాం. అనుపానులుగా అవకాయ, మినపసున్ని బహు శ్రేష్టమైనవి. ఒక కప్పులో గట్టి పెరుగు ఉంటే సంపూర్ణ అహారమే.
ఉప్మా తినండి ఇమ్యూనిటీ పెంచుకోండి.
– కాముధ – కాకర మురళీధర్.
కలడంతటన్
June 13, 2020కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం
గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం
గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్.
పై పద్యం భాగవతం ప్రహ్లద చరిత్రలో ప్రహ్లద హిరణ్యకశప సంవాదంలొ వస్తుంది. విష్ణువు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు, పైపద్యం ప్రహ్లదుడు చెపుతాడు.
పంచభూతాలలోను, అన్ని దిశలోను, రేయింబవళ్లలోను, సూర్యచంద్రులలోను ఓంకారంలోనూ, త్రీమూర్తులలోను, స్త్రీపురుష,నపుసంకులలోనూ ఈశ్వరున్నాడు, అన్నీటిలోను లోను ఉన్నాడు, ఇక్కడా అక్కడా అని వేరే ఎందుకు వెతకటం అని అర్ధం.
చాలా మంచి పద్యం. ఇందులో ఒకటి, త్రిలింగవ్యక్తులంతటన్, అని పోతన ఎందుకన్నాడు, అన్నిటిలొనూ ఉన్న పోతన ప్రత్యేకం గా త్రిలింగ వ్యక్తులు అని ఎందుకు తిరిగి చెప్పాడు. త్రిలింగ వ్యక్తులు లంటే ఎవరు, అందరూ అనకుండా ఒక ప్రదేశాన్ని సూచించినట్లు అంతటా అని ఎందుకన్నాడు. త్రిలింగదేశంలొ ఉండే వ్యక్తులు కాదా, అంటే తెలుగు వారే కదా. ఎందుకలా అన్నాడు అంటే పోతన భాగవతాన్ని తెలుగులోనే వ్రాసాడు కాబట్టి.
పోతన తెలుగు భాగవతాన్ని తెలుగులో మంత్రాక్షారాలు నిఘూడంగా కూర్చి వ్రాసాడు. భాగవతాన్ని పలికితే భవహరమై, శ్రీకైవల్యాన్ని చేరటం తధ్యం. పోతన తెలుగు వాడవటం మన అందరి అదృష్టం.
కం!!
తెలుగున వ్రాసిన వేదము
లలిత మధురకథలు వీనులకు విందగుచున్
చిలికిన సుధారసంబై
పలికిన భవహరమగునట భాగవతంబున్
కాముధ – కాకరమురళీధర్
December 16, 2019
కం!!
అనురాగ మాలికలతో
పెనవేసిన బంధములను వేడుకగా చూ
చి నిముషమున విద్వేషం
బును కల్గగ వేరు పరతువు ఇదేమి శివా.
ఇలనుండిన వైకుంఠము
కలనైనన్ మరుపురాని కరుణామూర్తీ
కలినుండిగావ మమ్ముల
వెలసితివి తిరుమలనందు వేంకటరమణా
కాముధ – కాకర మురళీధర్
ముల్లోకాలు.
October 3, 2019ఏకకాలం లొ ముల్లోకాలలొ నివసిస్తాం.
మొదటిది చరలోకం. మనం భూమిపై మనం ఉన్నాం. భూమి తనలో తాను తిరుగుతోంది.
దరి దాపు గంటకు 1500 KM వేగంతొ భూమి తిరుగుతొంది. తనలో తాను భ్రమణం కాలనికి ఒక రోజు అని పేరు.
ఇది మనకందరికి తెలిసిందే. ఇదే కాకుండా భూమి సుర్యుని చుట్టూ తిరుగుతొంది. ఈవేగం దరిదాపు సెకెనుకు 30 KM, గంటకు 1,07,000 KM.
భూపరిభ్రమణ కాలానికి సంవత్సరం అని పేరు. ఇది కూడా మనకు తెలుసు.
మరి సూర్యుడు కల్పకేంద్రకం (Center of Galaxy) చుట్టు ప్రదక్షణ చెస్తాడు.
దాని వేగం దరిదాపు సెకెనుకు 230 KM అంటె గంటకు 8,28,000.
మొగుడుతొ పాటు పెళ్ళాం పిల్లలు వెళ్ళినట్లుగా, సుర్యుడితో పాటు భూమి తొ సహా మిగతా గ్రహాలు ఉపగ్రహాలు అన్నీ ప్రయాణిస్త్తాయి.
తప్పదుగా మరి. ఈ పరిభ్రమణానికి పట్టేకాలన్ని ఒక యుగం అంటారు. ఇది కొంచం మనకు తెలుసు. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం అంటారు. ఇది మనందరకూ తెలుసు.
ఇలా ఉంటె ఈ కల్పకం(Galaxy) మొత్తం విశ్వకెంద్రకం (Center of Universe) చుట్టు తిరుగుతోంది.
దాని వేగం సెకెనుకు 200 KM అంతె దరిదాపు గంటకు దరిదాపు 7,50,000 KM. ఈ వేగంతొ ఒక అస్తిర కక్ష్య లొ ప్రయాణిస్తూ ఉంటుంది.
ఈకల్పక పరిభ్రమణానికి పట్టే సమయాని మన్వంతరం అంటారు. (దీనికి మనువుకు, మనుచరిత్రకి ఎలాంటి సంబంధం లేదు) ఇది కొంతమందికి తెలుసు.
ప్రస్తుత మన్వంతరానికి వైవశ్వత మన్వంతరం అని పెరు. ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది.
ఇదే కాకుండా విశ్వ కేంద్రకం వ్యాకొచిస్తునాది దీనివలన విశ్వం మొత్తం పెరుగుతోంది. దీనిని బ్రహ్మణము అని అంటారు.
దీని రమారమి వ్యాకొచవేగం సెకెనుకు 72 KM, దీనివలన మన్వంతరానికి మన్వంతరనికి పరిభ్రమణ కాలం పెరుగుతుంది. యుగానికి యుగానికికాలం కూడా పెరుగుతుంది.
అంటె ఈ విశ్వంలొ ఒకసారి మనం ఉన్న చోటుకి మరొ సారి వచ్చే ప్రసక్తే లేదు.
ఇంక రెండవ లొకం
దీనికి కాల లొకం అంటారు. ఇది విశ్వ వ్యాకొచం వలన ఏర్పడుతుంది. దీనికి ముందుకు పోవడమే తప్ప వెనుకకు మరలడం లేదు. దీని గురించి మనకందరకు తెలుసు.
కాల రహస్యం గురించి మరో సారి వివరంగా చర్చించుకుందాం.
మూడవది మాయాలోకం.
ప్రస్తుతం మన నివశించే లోకం. భూమి ఇంత చండ ప్రచండ వేగాలతొ వివిధ దిశలలొ దూసుకు పోతున్నా మనకు తెలీదు.
దివా రాత్రులు, సుర్యోదయాలు, చంద్రకళలు రొజూ వచ్చె నక్షత్రలు మనచుట్టు నే ఉంటాయి. అసలు భూమి కదులుతున్నట్తు మన అనుభవం లొకి రాదు.
మన జాగింగ్ వేగమే మనవెగం. పట్టు బడకుండా కారు నడిపే వేగమే మనవేగం. అనుదుకె దీనిని మిధ్యా లొకం అంటారు.
దీనిగురించి మనం రొజు చెకొనె పూజ సంకల్పం లొ చక్కగా చెప్పబడింది.
మహవిష్ణో రాజ్జాయ – శ్రీ మహా విష్ణురాజ్యం అంటె ఈ విశ్వంలొ
ప్రవర్తమానస్య – ప్ర- ఎల్లప్పుడు వర్త – చలించే మానస్య – లెక్కల పట్టికలో
ఆద్య బ్రహ్మణః – ఈ రోజు వ్యాకోచించె విశ్వంలొ
దితీయ పరార్ధే – రెండవ పరార్ధమైన. మొడటి పరార్ధంలొ ఈ విశ్వం కేవలం స్తలకాల శక్తులతో నిండి ఉండెది, ఈ గెలాక్సీలు నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రాహలు తరువాత పునఃసృష్టిలొ ఏర్పడ్డాయి
శ్వేత వరహ్హ కల్పే – మన Milky way Galaxy సంస్కృతం లొ పేరు.
వైవస్వత మన్వంతరే – మన కల్పక ప్రస్తుత ప్రరి భ్రమణం పేరు.
కలియుగే ప్రధమ పాదే – మన సుర్య కుటుంబం ప్రస్తుత ప్రరిభ్రమణం పేరు. ఇంకా మనం first quarter లొనే ఉన్నాం
జంబో ద్వీపే – నేరేదు పండు ఆకారం లొ ఉండె భూమిలో
భరత వర్షే – భరతుదు పాలించిన రాజ్యంలొ
భరత ఖండే – హిమలయాలకి కన్యాకుమారికిమధ్య ఉన్న భాగానికి
కావేరి క్రిష్ణా మధ్య భాగే – కావేరీ క్రిష్ణా నదుల మధ్యలో – మాచెన్నైకి.
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన*– ఈరోజు మన వ్యవహారం లొ ఉన్న చంద్ర మానం ప్రకారం తరువాత సంవత్సరం ఋతువు నెల పక్షం తిధి వస్తాయి.
ఇవి కూడా మనం భూ కక్ష్యలొ ఎక్కడ కచ్చితం గా ఉన్నామో తెలియజేస్తాయి.
చూసారా రోజు మనం చెప్పుకోనె సంకల్పం లో చాలా సులభం గా ఖగొళ శాస్త్రాలు మేళవించి మన స్తల కాలాల్ని నిర్ణయించి చెప్పేరో.
ప్రస్తుతం ఉన్న చాంద్రమాన పంచాంగాన్ని వరహామిహురుడు రాసాడు.
ఆయనెమీ ఖగోళ సాస్త్రాన్ని రాయలేదు. వెదాలలో ఉన్న ఖగొళ శాస్త్రాన్ననుసరించి పంచాంగ నిర్ణయంచేసాడు.
ఆయను విక్రమార్కుని ఆస్తాన పండితుడు. అందుకె ప్రస్తుత శకాన్ని విక్రమార్క శకం అంటారు. వరహ్హమిహురుని శిష్యుడే ఆర్య భట్టు.
విక్రమార్కునికే భోజరాజు అని కూడా పేరు.
ప్రణవ నాదమైన ఓకారం గురించి – బీజాక్షరాలైన ఓం! శ్రీం! హ్రీం! గురించి ప్రధమ ద్వితీయ పరర్దాలగురించి మరో టపాలొ. అలగే చాంద్రమాన పంచాంగం గురించి మరోక టపాలో తెలుసుకుందాం.
మురళీధర్ – కాముధ
భాగవత కథలు
July 22, 2019కం!!
పిలచిన పలికెడు వాని క
థలు వినినంతనె మనమున ధైర్యము కలుగున్
పలు కష్టంబులు కలిగెడి
కలికాలంబున, సులభముగ భవహరమగున్
షష్ట్యంతాలు
July 1, 2019షష్ట్యంతాలు
హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం
హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.
శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని
ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా
పాలికి, వర్ణధర్మపరిపాలికి నర్జునభూజయుగ్మ సం
చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్.
క్షంతకుఁ గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా
రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ
హంతకు నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్.
న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన
స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం
ధాయికిఁ బీతవస్త్రపరిధాయికిఁ బద్మభవాండభాండ ని
ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.
షష్ట్యంతాలు అంటే కావ్యాన్ని అంకితం ఇచ్చే సందర్భంలొ వ్రాసిన పద్యాలు. ఇక్కడ పోతన కావ్యాన్ని రాముని ఆజ్జతో రాసి
శ్రీహరికి అంకితం ఇచ్చాడు. ఆపద్యాలన్ని ఒక శిల్పి శిల్పాల్ని చెక్కినట్టు చెక్కాడు పోతన్న.
మొదటగా నాలుపద్యాల్ని ధర్మానికుండె నాలుగు పాదాలైన సత్యము, శీలము, దయ, న్యాయము గా విభజించేడు.
అవి ఒక్కొక్కటి ఒక్కొపద్యానికి వర్తింపజేస్తూ ధర్మాన్ని నాలుగుపాదాల నడిపించమని ఆ శ్రీహరిని వేడుకున్నాడు.
అంత్యప్రాసలతొ అత్యంత సుందరంగా వర్ణించేడు. మనకి ఒక సందేహం రావచ్చు. మొదటి పద్యంలొ సత్యం గురించి
చెప్పలేదుకదా. నాలాంటి మందబుద్ధులు ఉంటారిని పోతనకి బాగాతెలుసు. అందుకోసమే ముందుగానే చెతు లారంగ
అనే పద్యాన్ని రాసేడు.
అందులో క్రమాలంకారాన్ని అన్వయంచెస్తే దయను శివుని గాను సత్యాన్ని హరి గాను తెలుసుకొవచ్చు.
ఆ నాలుగు పద్యాల్లోనె కృష్ణ లీలన్ని వర్ణించేడు. గొకులం నుంచి కృష్ణావతార సమాప్తి వరకు చెప్తూ కృష్ణ మూలము
అన్న పదాన్ని సార్ధకం చేసేడు.
మొదటి పద్యం లొ హారి అన్న పదం ప్రతి పాదానికి రెండు సార్లు వస్తుంది. హరికి, లక్ష్మీదెవికి స్వాగతం చెపుతూ అడుగడుగునా
(పాదం అంటె అడుగేకదా) అక్షర మాలలతొ స్వాగతం పలికేడు. దాంతో పాటుగా ఆ పద్యం చదువుతుంటె ఆశభ్దం లొ కొన్ని
మనకి స్పురిస్తాయి. నందగొకులము అనేటప్పుడు నందకం అన్నది, చక్రదైత్య అనేటప్పుడు. చక్రము. గొపనితంబినీ
అన్నప్పుడు గద, ఘోష కుటీప అన్నప్పుడు శంఖం, సంపద అన్నప్పుడు లక్ష్మీ దెవి, ఇలా అర్ధంలొ కాకుండా శభ్ద చిత్రణ
ద్వారా విష్ణుమూర్తిని సాలంకృతం గా మనముందు ఆవిష్కరిస్తాడు,.
పోతన తెలుగు వాడవటం మనందరి అదృష్టం. పలికిన భవహరమగునట అనే తనేచెప్పేడు. భాగవతం చదువుదాం
చదివిద్దాం.
కాముధ – కాకర మురళీధర్.